Bappam TV: ఐబొమ్మ రవిని అరెస్టు చెయ్యడంతో.. భారీ సినిమా పైరసీకి బ్రేక్ పడిందని పోలీసులు అనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు అంతగా ఫలించినట్లు కనిపించట్లేదు. మరిన్ని పైరసీ సైట్లు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ రవి బప్పం టీవీ వెబ్సైట్ని ఎందుకు తెచ్చాడో తెలుసుకుందాం.
ఐబొమ్మ రవిని ఐదు రోజులపాటూ.. కస్టడీలో ప్రశ్నించిన పోలీసులకు.. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. మరో వారం పాటూ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు అతను.. ఐబొమ్మ వెబ్సైట్ ఉండగా.. మరి బప్పం టీవీ అనే వెబ్సైట్ని ఎందుకు ప్రారంభించాడు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇక్కడే పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఈ రవి.. ఐబొమ్మను డైరెక్టుగా ఆపరేట్ చెయ్యలేదు. అలా చేస్తే, పోలీసులు కనిపెట్టడం తేలికయ్యేది. అందుకే అతను.. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (CMS) విధానాన్ని పాటించాడు. అంటే.. ఐబొమ్మ డైరెక్టు వెబ్సైట్లా కాకుండా.. మరో భారీ నెట్వర్క్లో భాగంగా ఉంటుంది. వేరే హోస్ట్ ద్వారా.. ఐబొమ్మను ఆపరేట్ చేసేవాడు. అందువల్ల ఐబొమ్మ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో పోలీసులకు తెలిసేది కాదు. హోస్ట్ ద్వారా అతను సినిమాలను అప్లోడ్ చేస్తుంటే.. ఇది పోలీసులకు సవాలుగా మారింది.
బప్పం అంటే ఏంటి?
ఐబొమ్మ ద్వారా సంపాదించే డబ్బును మరింత పెంచుకునేందుకు రవి.. బప్పం టీవీ అనే మరో లింక్ వెబ్సైట్ ప్రారంభించాడు. ఈ రెండింటికీ తేడా ఏమీ లేదు. కాకపోతే.. మరిన్ని ఎక్కువ బెట్టింగ్ లింకులు, గేమింగ్ యాడ్లను పెట్టి.. ప్రజలను మరింత ఎక్కువగా బెట్టింగ్ వైపు నడిపించాడు. తద్వారా మరింత ఎక్కువగా మనీ అక్రమ మార్గాల్లో సంపాదించేందుకు వీలైందని పోలీసులు తెలిపారు. ఇంతకీ బప్పం అనే పేరు ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా.. రవి మౌనం వహించాడు. పోలీసులు గట్టిగా అడగటంతో.. బప్పం అంటే వెధవ అని అర్థం అనీ.. బప్పం టీవీలో పైరసీ సినిమాలు చూసేవాళ్లను వెధవలుగా భావిస్తూ.. ఆ పేరు పెట్టానని రవి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
పైరసీ వల్ల రవి ఇప్పటి వరకు సుమారు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం రవి భారత పౌరుడు కాదు. అతను లక్ష డాలర్లు ఖర్చు పెట్టి కరీబియన్ దీవుల్లో పౌరసత్వం పొందాడు. తనను పోలీసులు గుర్తించకూడదనే ఉద్దేశంతో.. వారానికో దేశానికి వెళ్లేవాడు. జల్సాలు చేసేవాడు. భారీగా డబ్బు ఖర్చు పెట్టేవాడని పోలీసుల విచారణలో తేలింది. జల్సా జీవితానికి అలవాటు పడి.. ఇదంతా చేశాడని తెలిసింది.
పోలీసులకు త్వరలో వెబ్ 3 టెక్నాలజీ రాబోతోంది. దీని ద్వారా.. పైరసీ ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో పోలీసులకు తెలిసిపోతుంది. తద్వారా ఇండియాలో పైరసీ సైట్లను పూర్తిగా క్లోజ్ చేయించేందుకు వీలవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఐతే.. పైరసీ పట్ల ప్రజలు ఆసక్తి చూపకూడదంటే.. థియేటర్ల టికెట్ల రేట్లు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదివరకు ముందు కూర్చున్నవారికి ఒక రేటు, వెనక కూర్చున్న వారికి మరో రేటు ఉండేదనీ.. ఇప్పుడు అందరికీ ఒకే రేటు పెట్టి దోచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులూ, ప్రభుత్వాలూ ఈ అధికారిక దోపిడీని ప్రోత్సహించడం మాని, చెక్ పెట్టాలని కోరుతున్నారు.
