హైదరాబాద్: మహేశ్బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో #GlobeTrotterevent టైటిల్తో పాటు, ఈ చిత్ర (Varanasi Movie) కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది.
‘వారణాసి’ ప్రపంచం, రాజమౌళి విజన్ అందరినీ అబ్బుర పరిచింది. ఆ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో తీస్తున్నట్లు చెప్పారు. మామూలు తెరపై సన్నివేశం ఎలా ఉంటుంది? ఐమ్యాక్స్ స్క్రీన్లో ఎలా ఉంటుంది? అన్న విషయాన్ని ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ తెరపై చూపించారు. అది చూసి ఈవెంట్కు వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. తాజాగా ఐమ్యాక్స్ వెర్షన్లో ‘వారణాసి’ స్పెషల్ వీడియో విడుదలైంది. ఆ వీడియో డీటెయిలింగ్ చూస్తే, రాజమౌళి సృష్టించిన ప్రపంచం ఎంత పెద్దగా ఉందో అర్థమవుతోంది. కంప్యూటర్స్, మొబైల్ ఫోన్లలో చూస్తే తేడాలు గమనించడం కాస్త కష్టమే. వెండితెరపై అదీ ఐమ్యాక్స్ ఫార్మాట్లో చూస్తే వచ్చే మజానే వేరు. మామూలు వెర్షన్లో కనిపించని అదనపు దృశ్యాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో చూడొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఐమ్యాక్స్ అనుభూతి దక్కేనా?
‘అవతార్3’ విడుదల సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్తో రాజమౌళి ముచ్చటించారు. ఈ సందర్భంగా 2009లో వచ్చిన ‘అవతార్’ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్లో అత్యధిక రోజులు ప్రదర్శితమవడమే కాకుండా, అత్యధిక వసూళ్లను సాధించిన స్క్రీన్గానూ రికార్డు సృష్టించిందని తెలిపారు. అనుకోని కారణాల వల్ల తెలుగు వారికి ఉన్న ఏకైక ఐమ్యాక్స్ ఫార్మాట్ను తీసేశారు. ‘వారణాసి’ టైటిల్ టీజర్ వచ్చిన దగ్గరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ ఫార్మాట్ థియేటర్ ఉండాలని నెటిజన్ల నుంచి ఒకటే డిమాండ్. ఇప్పటికే హైదరాబాద్లో ఎపిక్యూ స్క్రీన్ అందుబాటులోకి రాగా, హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మితమవుతున్న మల్టీప్లెక్స్లో ఒక స్క్రీన్ డాల్బీ విజన్తో రానుంది. ప్రస్తుతం దర్శకుల విజన్, లార్జర్ దేన్ లైఫ్ కథలు, కొత్త సాంకేతికత తారస్థాయిలో ఉన్నాయి. అది తెరపైకి వచ్చినప్పుడు అందుకు సరైన వేదిక ఉండాలి. అప్పుడే ప్రేక్షకుడు కూడా చక్కటి అనుభూతిని ఆస్వాదిస్తాడు. మరి ‘వారణాసి’ విడుదలయ్యేలోపు తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ వెర్షన్లో స్క్రీన్ను ఎవరైనా అందుబాటులోకి తీసుకొస్తారా?లేదా?అన్నది చూడాలి.
‘వారణాసి’ (Varanasi)లో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో మహేశ్బాబు కనిపించారు. ఇందులో ఆయన రుద్ర పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ పంచనున్నారు. ఇక కథానాయిక మందాకినిగా ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడు ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో అలరించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో ఈ మూవీని విడుదల (varanasi movie release date) చేయనున్నారు.
